'లగచర్ల' రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడంపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి

  • సంగారెడ్డి జైల్లో వైద్య పరీక్షల సమయంలో రైతుకు ఛాతినొప్పి
  • వైద్యం కోసం జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు
  • ఆసుపత్రికి తరలించే సమయంలోనూ బేడీలు వేయడంపై సీఎం ఆగ్రహం
లగచర్ల దాడి కేసులో నిందితుడు ఈర్యా నాయక్‌కు ఛాతీ నొప్పి రాగా... అతనిని జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో చేతికి బేడీలు వేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈర్యా నాయక్ సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

జైల్లో వైద్య పరీక్షల సమయంలో అతనికి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో అతనిని తొలుత సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రైతుకు గుండెపోటు రావడంతో పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఈర్యా నాయక్‌కు బేడీలు వేసి తీసుకుపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఈర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

Revanth Reddy
Congress
Lagacharla
Telangana

More Telugu News